ఉచిత విద్యుత్ విషయంలో తగ్గేదే లేదు-రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
Share this:
కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ విషయంలో తగ్గేదే లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సూర్యాపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం టేకుమట్ల గ్రామంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గత కొన్నాళ్లుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కుటిలయత్నం చేస్తుందన్నారు. విద్యుత్ రంగంలో ఊహించనంత విజయం సాధించిన తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అక్కసుతో ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సంస్కరణల పేరుతో రైతులకు మీటర్లు పె ట్టాలని లేని పక్షంలో కేంద్ర నుంచి సహకారం అందదని బెదిరిస్తున్నట్లు చె ప్పారు. బీజేపీ పాలిత ప్రాంతాలలో విద్యుత్ సంక్షభం ఉన్నందున రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న తెలంగాణలో విద్యుత్ సరఫరాకు కేంద్ర ప్రభుత్వం అంతరాయం కలిగించేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. స్వయంగా కేంద్ర మంత్రి రంగంలోకి దిగి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ను విక్రయించకుండా లోన్ల విషయంలో సహకరించకుండా అడ్డుపడుతున్నట్లు తెలిసిందన్నారు. రాజస్థాన్లో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతాంగానికి అండగా ఉంటామని ప్రస్తుత విద్యుత్ పాలసీని కొనసాగించడంలో తగ్గేదే లేదని వెల్లడించారు.